
- జాతరను తలపించిన వేములవాడ
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం జాతరను తలపించింది. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర నలుమూలలతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజామునే స్వామివారికి తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం కోడెల క్యూలైన్, ధర్మదర్శనం క్యూలైన్ మీదుగా ఆలయంలో వెళ్లి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి సెలవులు దగ్గరపడుతుండడం, సోమవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
రద్దీ కారణంగా రాజరాజేశ్వర స్వామి ధర్మదర్శనానికి 8 గంటలకుపైగా సమయం పట్టడంతో ఇబ్బందులు పడ్డారు. రూ. 100 టికెట్ దర్శనానికి ఆరు గంటలు, రూ. 300 బ్రేక్ దర్శనానికి రెండు గంటలకు పైగా పట్టగా, కోడె మొక్కులు చెల్లించేందుకు భక్తులు సుమారు నాలుగు గంటల పాటి వేచి ఉండాల్సి వచ్చింది. సోమవారం ఒక్కరోజే స్వామివారిని సుమారు 80 వేల మందికి పైగా దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు అశీర్వచనం చేయగా, ఈవో వినోద్రెడ్డి స్వామివారి ప్రసాదం అందజేశారు.